పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీలు, హెచ్చరికలు
పిఠాపురం, జనవరి 10: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించి స్థానికుల సమస్యలు పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “నా పిఠాపురం అన్నదమ్ములకు, అక్కాచెల్లెళ్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ విశ్వాసం నా మీద ఉంటుంది అని నమ్ముతున్నాను. నా గెలుపు రాష్ట్ర గెలుపు అన్న నమ్మకంతో పనిచేస్తాను,” అన్నారు.
పోలీసులపై విమర్శలు
సభలో పిఠాపురం పోలీసుల తీరుపై పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “పిఠాపురంలో దొంగతనాలు, గంజాయి విక్రయం పెరిగాయని ఫిర్యాదులు వస్తున్నాయి. స్థానికులు పోలీసులకు సమస్యల గురించి చెప్పినా సరైన చర్యలు తీసుకోవడం లేదని నా దృష్టికి వచ్చింది. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది,” అన్నారు.
ఈవ్ టీజింగ్పై తీవ్ర హెచ్చరిక
“ఈవ్ టీజింగ్ అనేది అత్యంత హేయమైన చర్య. ఆడపిల్లలను వేధిస్తే తొక్కి నార తీస్తా. ఇకపై పిఠాపురంలో ఇలాంటి ఘటనలు జరగకూడదు. నేరాలు చేసి కులాలను అడ్డుపెట్టడాన్ని తట్టుకోం,” అని హెచ్చరించారు.
మరోసారి అవకాశంపై విజ్ఞప్తి
“మీ కోసం నేను పని చేస్తేనే మరోసారి అవకాశం ఇవ్వండి. పనిచేయకపోతే నన్ను వదిలేయండి. పిఠాపురం బాగుండాలి, లా అండ్ ఆర్డర్ మెరుగ్గా ఉండాలి,” అని పవన్ స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా పర్యటనకు సన్నాహాలు
పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో పిఠాపురం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేపట్టి ప్రజా సమస్యలపై చర్యలు తీసుకోవాలని సంకల్పించారు. “మరో 15 ఏళ్లపాటు మంచి పాలన అందించాలని కోరుకుంటున్నాను,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
