రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. సినీ రంగం, సేవా రంగంలో విశేషమైన సేవలను గుర్తించి ఈ పురస్కారాలను అందజేస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించారు. నటుడిగా, నిర్మాతగా మాత్రమే కాకుండా సమాజ సేవలోనూ అత్యుత్తమ కృషి చేసినందుకు గానూ ఈ గౌరవం వరించింది.
బాలకృష్ణకు అవార్డు ప్రకటించగానే సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అభినందనలు తెలిపారు. పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ వేదికగా,
“ఐదు దశాబ్దాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన బాలకృష్ణ గారికి పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం చాలా సంతోషకరం. వెండితెరపై ఎన్నో విభిన్నమైన పాత్రల ద్వారా అభిమానులను అలరించారు. హిందూపురం ఎమ్మెల్యేగానే కాకుండా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్గా కూడా విశేషమైన సేవలందించారు. ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు. పద్మ పురస్కారాలకు ఎంపికైన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.
