సీనియర్ జర్నలిస్ట్, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ జర్నలిస్ట్, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ (Satyanarayana) ఆదివారం ఉదయం తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, సంగారెడ్డిలోని తన ఇంట్లో కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీతో పాటు పలు కీలక పదవుల్లో పని చేశారు.
2007లో కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలుపొందిన ఆయన, 2008లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. టీజీపీఎస్సీ సభ్యుడిగా ప్రజా సేవలు అందించిన ఆయన, 2024 లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
సత్యనారాయణ మృతిపై పలు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు,
“ఆర్ సత్యనారాయణ మృతితో రాష్ట్రం ఓ గొప్ప నేతను కోల్పోయింది. ఆయన జర్నలిస్టుగా, ఎమ్మెల్సీగా, టీజీపీఎస్సీ సభ్యుడిగా తనదైన ముద్రవేశారు. బీఆర్ఎస్ కోసం అందించిన సేవలు చిరస్మరణీయమని” పేర్కొన్నారు.
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,
“సత్యనారాయణ మృతి నా హృదయాన్ని కలచివేసింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అని అన్నారు.
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి,
“తెలంగాణ ఉద్యమంలో ఆర్ సత్యనారాయణ పాత్రను ఎప్పటికీ మరచలేం. ఆయన అద్భుతమైన సేవల వల్ల తెలంగాణ ఉద్యమానికి మరింత బలమెచ్చింది” అని వ్యాఖ్యానించారు.
సత్యనారాయణ మృతి తెలంగాణ రాజకీయ, జర్నలిజం రంగాలకు తీరని లోటుగా నిలిచింది.
