76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఏపీలో ఘనంగా నిర్వహణ
అమరావతి: 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. “వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర విజన్ సాధనకు రాజ్యాంగ స్ఫూర్తితో కృషి చేస్తాం” అని ఆయన అన్నారు. మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, అందరి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
శాసనసభలో ప్రత్యేక వేడుకలు
అమరావతిలోని శాసనసభ ప్రాంగణంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. “భారత రాజ్యాంగం స్ఫూర్తితో కూడిన సమైక్యత, సమగ్రత, సోదరభావం విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ” అని ఆయన పేర్కొన్నారు.
సచివాలయంలో వేడుకలు
ఏపీ సచివాలయంలో సీఎస్ విజయానంద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. “రాష్ట్ర అభివృద్ధి కోసం రాజ్యాంగ విలువలను పాటిస్తూ ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుంది” అని చెప్పారు.
వైఎస్ జగన్ సందేశం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ట్విటర్ వేదికగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. “భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తించి, భారత రాజ్యాంగాన్ని బలోపేతం చేయడంలో అందరం కలిసికట్టుగా పని చేయాలి” అని ఆయన పేర్కొన్నారు.
