హైడ్రాలో ప్రజల మన్ననలు పొందేలా పని చేయాలి: కమిషనర్ రంగనాథ్
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం హైడ్రా కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “2025వ సంవత్సరం హైడ్రా అభివృద్ధిలో కీలకమైనది. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు ఉద్దేశించిన భూముల కాపాడడంలో ప్రతి ఒక్కరూ కంకణబద్ధులవ్వాలి,” అని పేర్కొన్నారు.
కమిషనర్ రంగనాథ్ అన్ని హైడ్రా అధికారులకు, సిబ్బందికి సూచిస్తూ, ప్రజాస్వామ్య హక్కులను గౌరవిస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. “ప్రజల ఆశీర్వాదాలు పొందడం కోసం వారి మన్ననలు అందే విధంగా సేవలు అందించాలి. ప్రభుత్వం భావిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి,” అని అన్నారు.
అంతేకాకుండా గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైడ్రా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ, “ప్రజల సంక్షేమానికి, సమాజ అభివృద్ధికి హైడ్రా అధికార యంత్రాంగం నిబద్ధతతో పని చేయాలి,” అని కమిషనర్ రంగనాథ్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో హైడ్రా అధికారులు, సిబ్బంది, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
