“కుల గణన విజయం ప్రతిపక్షాలకు నచ్చలేదు” – కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్
హైదరాబాద్: తెలంగాణ కుల గణన (Caste Census) విజయాన్ని కొన్ని ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తీవ్రంగా విమర్శించారు. గురువారం ఎక్స్ వేదికగా ఓ వీడియో విడుదల చేసిన ఆయన, “గత ప్రభుత్వ హయాంలో సకల జనుల సర్వే రిపోర్టును బయటపెట్టలేదని, కానీ సీఎం రేవంత్ రెడ్డి మూడు నెలల్లోపు కుల గణన నివేదికను ప్రజలకు అందించారని” కొనియాడారు.
“బీసీలకు 42% రిజర్వేషన్ – తెలంగాణ కాంగ్రెస్ సంకల్పం”
బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. “కమిషన్ నివేదిక ప్రకారం బీసీలకు ఏ విధంగా రిజర్వేషన్లు అమలు చేయాలనే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని” తెలిపారు.
“పదేళ్లు పాలించిన కేసీఆర్ బీసీ, ఎస్సీ, ఎస్టీల గురించి ఆలోచించలేద”
“తెలంగాణలో పదేళ్లు పాలించిన కేసీఆర్, బీసీ, ఎస్సీ, ఎస్టీల గురించి ఒక్క రోజైనా ఆలోచించలేదని” దయాకర్ ఆరోపించారు. “కానీ ఇప్పుడు బీసీలకు న్యాయం చేయడంలో వెనుకబడ్డామనే బాధతో ప్రతిపక్షాలు తప్పుడు ప్రకటనలు చేస్తున్నాయి” అన్నారు.
“బీజేపీ కేంద్రంలో కూడా కుల గణన చేయాలి”
“తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన తీరులోనే బీజేపీ ప్రభుత్వం కూడా కుల గణన నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నా, కేంద్రం మాత్రం పట్టించుకోవడం లేదు” అని దయాకర్ మండిపడ్డారు. “తెలంగాణలో ముస్లిం జనాభా పెరుగుతోందని, ప్రభుత్వం ముస్లింలకు అనుకూలంగా మారిందని బీజేపీ నేతలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని” విమర్శించారు.
“బీసీల్లో ముస్లింల జనాభా 10%కి చేరింది”
“తెలంగాణలో బీసీల్లో ముస్లింల జనాభా 10%కు చేరిందని, కుల గణన సర్వేను బీజేపీ, బీఆర్ఎస్ అబాసుపాలు చేయాలని చూస్తున్నాయని” ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ సమస్యలను కూడా త్వరలోనే ప్రభుత్వం పరిష్కరించనుందని వెల్లడించారు.
