స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాలి – సీఎల్పీ భేటీలో సీఎం రేవంత్ దిశానిర్దేశం
హైదరాబాద్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. ఇవాళ హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన సీఎల్పీ సమావేశంలో, పార్టీ బలోపేతం, ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ పాల్గొన్నారు.
గ్రామాల్లో హామీల అమలుకు ఎమ్మెల్యేలు కృషి చేయాలి
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, “అత్యధిక గ్రామాల్లో కాంగ్రెస్ ఏకగ్రీవ విజయం సాధించాలనే బాధ్యత ఎమ్మెల్యేలదే” అని స్పష్టం చేశారు. గ్రామాల్లో హామీల అమలుకు ముందడుగు వేసి, సీసీ రోడ్లు, ఆలయాలు, నిర్మాణ అనుమతుల కోసం నిధుల మంజూరు పై మంత్రులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
బీసీలకు 42% స్థానిక సంస్థల పదవులు – కాంగ్రెస్ నూతన వ్యూహం
బీసీలకు 42% స్థానిక సంస్థల పదవులను కేటాయించే బాధ్యత కూడా ఎమ్మెల్యేలదేనని సీఎం రేవంత్ అన్నారు. కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా, కొత్త – పాత నేతలంతా సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
