|| The coalition government cleared the arrears of a thousand crores ||: మంత్రి సత్యకుమార్
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాజీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, “వంద ఎలుకలు తిన్న పిల్లి ప్రాయశ్చిత్తం కోసం కాశీ యాత్రకు వెళ్లినట్టుంది వైఎస్ జగన్ వ్యవహారం” అంటూ వ్యాఖ్యానించారు.
“గత వైసీపీ ప్రభుత్వం మందుల సరఫరాదారులకు వెయ్యి కోట్లకుపైగా బకాయిలు పెట్టింది. వైద్య సేవలను తీవ్రంగా దెబ్బతీసింది. కానీ, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే అన్ని బకాయిలను చెల్లించి, మందుల సరఫరాను పునరుద్ధరించింది” అని మంత్రి స్పష్టం చేశారు.
“పేదల ఆరోగ్యంతో ఆడుకున్నది వైసీపీ ప్రభుత్వమే. అవినీతిలో మునిగిపోయి, కమిషన్లకే పరిమితమై, వైద్య రంగాన్ని కుదేలు చేసింది. వైసీపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల్లో మందుల కొరత ఏర్పడింది. కానీ, ఇప్పుడు సంక్రమంగా మందుల సరఫరా చేస్తూ, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం” అని సత్యకుమార్ తెలిపారు.
“ప్రజారోగ్యం పట్ల వైసీపీకి చిత్తశుద్ధి లేకపోవడంతోనే ప్రజలు వారిని తిరస్కరించారు. అయినప్పటికీ, ఇప్పటికీ జగన్ అసత్య ప్రచారాలు చేస్తూనే ఉన్నారు” అని మంత్రి మండిపడ్డారు. “ఇప్పటికైనా వైసీపీ నేతలు బాధ్యతాయుతంగా నడుచుకోవాలి” అంటూ హితవు పలికారు.
