నారాయణపేటలో మెడికల్ కాలేజ్ ప్రారంభం – వైద్య విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు
నారాయణపేట: తెలంగాణలోని వైద్య విద్యార్థులు పేద ప్రజలకు సేవ చేయడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించే స్థాయికి ఎదగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
నారాయణపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం మెడికల్ కళాశాల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వైద్య వృత్తి గొప్పతనం గురించి వివరించారు. “ఈ అవకాశం అందరికీ రాదు, కొందరికే వస్తుంది. మీరు దీనిని సద్వినియోగం చేసుకుని గొప్ప స్థాయికి ఎదగాలి” అని విద్యార్థులకు సూచించారు.
ఈ సందర్భంగా, దివంగత మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి చేసిన సేవలను స్మరించుకుంటూ, నూతనంగా ప్రారంభమైన మెడికల్ కళాశాలకు ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం ప్రకటించారు. ఈ అంశంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన బూర్గుల రామకృష్ణారావు అనంతరం ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించే అవకాశం తనకు దక్కిందని, ఈ జిల్లాను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, దామోదర రాజనర్సింహా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు పర్ణికా రెడ్డి, శ్రీహరి, వంశీకృష్ణ, ఈర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
