కరీంనగర్,నేటి తెలుగు పత్రిక : దైవ దర్శనానికి వెళ్లినగదు, లగేజీ సామగ్రి కోల్పోయిన ఓ బాధిత కుటుంబానికి కరీంనగర్ ఎంపీ కార్యాలయం బాసటగా నిలిచింది. నిరాశ్రయులైన వారి సమాచారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టికి వెళ్ళడం తో ఆయన వెంటనే తన కార్యాలయ సిబ్బందిని అప్రమత్తం చేసి వారిని కరీంనగర్ కు రప్పించే ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ లోని రాంనగర్ కు చెందిన ఓ కుటుంబ సభ్యులు తమిళనాడు లోని కాంచీపురం వెళ్లారు. దైవ దర్శనం అనంతరం మంగళవారం రాత్రి ఆలయం చెంతన నిద్రించగా వారి సామగ్రిని గుర్తు తెలియని దొంగలు దొంగిలించారు. దీంతో బోరుమన్న ఆ కుటుంబీకులు స్థానికులకు ఈ విషయాన్ని చెప్పారు. బాధిత కుటుంబ సభ్యుల్లో ఒక బదిరుడు అండగా మరో ముగ్గురు మహిళలు.. ముగ్గురు చెన్నారులున్నారు. కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయానికి అక్కడి ఆలయ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో… కేంద్ర మంత్రి సూచనతో వారిని క్షేమంగా కరీంనగర్ రప్పించే ఏర్పాట్లు కార్యాలయ సిబ్బంది చేశారు. వారికి అక్కడ భోజన వసతి కల్పించడం తో పాటు కరీంనగర్ వచ్చేందుకు వీలుగా రైలు టికెట్స్ బుక్ చేయించారు. ప్రయాణ ఖర్చులను అందించారు. తక్షణమే మంత్రి స్పందించి న తీరుపై బాధిత కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.
