కోదాడ, ఏప్రిల్ 23 (నేటి తెలుగు పత్రిక): పకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న పండ్ల తోటలను రైతులను ఆదుకునేందుకు పంటల బీమా పథకాన్ని పగడ్బందీగా అమలు చేయాలని, తెలంగాణ పండ్ల తోటల రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఏనుగుల వీరాంజనేయులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల పంటలకు మద్దతు ధర నిర్ణయించినట్లుగా , మామిడి, బత్తాయి, నిమ్మ , వగైరా కు కూడా మద్దతు ధర ప్రకటించి, దళారుల నుండి పండ్ల తోటల రైతులను రక్షించాలని, తమ ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు ,శీతల గిడ్డంగులు నిర్మించాలని, పండ్ల తోట రైతులను ప్రోత్సహించేందుకు, నర్సరీ, మార్కెటింగ్,ఫలసాగర్ పథకాన్ని పునరుద్ధరించి, రైతులకు అవసరమైన మొక్కలు, ఎరువులు ఉచితంగా అందజేయాలని, వీరాంజనేయులు కోరారు. అకాల వర్షం, ఈదురు గాలులతో, వడగండ్ల తో నష్టపోయిన పండ్ల రైతులకు ఎకరాకు 50 వేలు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.



