నేటి రాత్రి నుంచి తరావీహ్ నమాజ్.
రేపు తెల్లవారుజాము నుంచి ఉపవాసాలు.
ముస్తాబైన మసీదులు.
మంగళగిరి ఫిబ్రవరి 19 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభమైంది. బుధవారం నెలవంక కనిపించగా, గురువారం వారం నుంచి ఉపవాసాలు ప్రారంభంకానున్నాయి. నెలరోజుల అనంతరం షవ్వాల్ నెలవంక కనిపిస్తే రంజాన్ పండుగ జరుపుకుంటారు. ఈ మాసంలోనే దివ్య ఖురాన్ అవతరించిందని ముస్లింల విశ్వాసం. ఖురాన్లోని 30 అధ్యయాలు ఈ మాసంలోనే పూర్తి చేస్తారు. దీనినే తరావీహ్ నమాజ్ అంటారు. తరావీహ్ నమాజ్ కోసం మసీదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
నెలరోజులపాటు ఉపవాస దీక్షలు.
రంజాన్ మాసంలో ముస్లింలు 30 రోజులపాటు ఉపవాస దీక్షలు పాటిస్తారు. దైనిక పనులు చేస్తూ కఠోర ఉపవాసం (రోజా) చేస్తూ అల్లాహ్ ను స్మరిస్తారు. నిరుపేదలు పడే ఆకలి బాధ ఎలా ఉంటుందో ఉపవాసాల మూలంగా అనుభవంలోకి వస్తుంది. ఉపవాసం అంటే కేవలం నీరు, ఆహారం తీసుకోవడమే కాదు. అన్ని రకాల చెడు కార్యాలు, అన్యాయం, అధర్మం, కామ కోరికలు మనసులోకి రానివ్వకుండా పాపక్రియల నుంచి దూరంగా ఉంటూ అల్లాహ్ స్మరణ చేస్తూ తనకు తాను అంతర్గతంగా ఆత్మ ప్రక్షాళన చేసుకోవడం.
రంజాన్ దీక్ష ప్రాముఖ్యత
రంజాన్ ఉపవాస దీక్షలో సహరీ, ఇఫ్తార్ ముఖ్యమైనవి. తెల్లవారుజామునే నిర్దేశిత సమయంలో అన్న పానీయాలు తీసుకోవాలి. దీనినే సహరీ అంటారు. ప్రతి రోజు కొన్ని నిమిషాల తేడాతో సూర్యాస్తమయం లో ఉపవాస దీక్ష విరమించడమే ఇఫ్తార్. తెల్లవారుజామున ఉపవాస దీక్షా సమయం ప్రారంభమైన నాటి నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ఆహార పానీయాలు తీసుకోరాదు. నోటిలో ఊరే లాలాజలం కూడా మింగకుండా ముస్లింలు కఠోర ఉపవాస దీక్ష పాటిస్తారు. సాయంత్రం వేళ మగ్రిబ్ నమాజ్ కు ముందు ఇఫ్తార్ ను ఖర్జూర, ఇతరత్రా ఫలాలతో విరమిస్తారు.
ఉపవాసాలు ఇలా.
రంజాన్ మాసాన్ని మూడు భాగాలుగా వర్గీకరిస్తారు. మొదటి పది రోజులు దైవ కారుణ్యానికి ప్రతీక. తర్వాత పది రోజులు క్షమాభిక్షకు ప్రతీక. చివరి పది రోజులు నరకం నుంచి విముక్తికి ఉపకరిస్తాయని దైవ ప్రవక్త మొహమ్మద్ (స. అ. సం) అభివర్ణించారు.
