- రూ.504 కోట్ల భారీ పెట్టుబడి… గ్రామీణ వ్యవసాయ రంగానికి నూతన శకం.
- PACSలను ఆధునిక మల్టీ పర్పస్ సౌకర్య కేంద్రాలుగా మారుస్తున్న ప్రభుత్వం.
- తక్కువ వడ్డీ రుణాలు… పూర్తి ప్రభుత్వ హామీతో రైతు సంఘాలకు భరోసా.
- డ్రైయింగ్ యార్డులు, ఆధునిక డ్రయర్లపై ప్రభుత్వ దృష్టి.
- ఆకాల వర్షాలకు అడ్డుకట్ట… RSKల ద్వారా టార్పాలిన్ల పంపిణీ.
- ఎలక్ట్రానిక్ డ్రయర్లపై పైలట్ ప్రాజెక్టులు…సాంకేతిక వ్యవసాయానికి శ్రీకారం.
- శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానం తెలిపిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.
అమరావతి, ఫిబ్రవరి 25, నేటి తెలుగు పత్రిక: శాసన మండలిలో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (AIF) కింద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS)ను బహుళార్థ సాధక సౌకర్య కేంద్రాలు (MPFC)లుగా అభివృద్ధి చేసే కార్యక్రమంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు సమగ్రంగా సమాధానం ఇచ్చారు. జూన్ 2020లో కేంద్ర ప్రభుత్వ Agriculture Infrastructure Fund (AIF) పథకం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, రైతు భరోసా కేంద్రం (RSK) స్థాయిలో నిల్వ మరియు ఆరబెట్టే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. విశాఖపట్నం జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా గోడౌన్లు మరియు డ్రైయింగ్ యార్డుల నిర్మాణం జరుగుతోందని, మొత్తం రూ.504.42 కోట్ల వ్యయంతో ఈ పథకం అమలవుతోందని పేర్కొన్నారు. నాబార్డ్ ద్వారా రీఫైనాన్స్ సదుపాయం కల్పించబడుతుందని, PACSలకు 4% వడ్డీపై 3% వడ్డీ రాయితీ లభిస్తుందని, 90% రుణం మరియు 10% మార్జిన్ మనీ విధానంలో ప్రాజెక్టులు అమలవుతున్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మార్జిన్ మనీ కింద రూ.50.4 కోట్లు మంజూరు చేసి అందులో రూ.20 కోట్లు ఇప్పటికే విడుదల చేసిందని, 33 సంవత్సరాల పాటు ఏడాదికి రూ.1 నామమాత్రపు అద్దెకు ప్రభుత్వ భూమి లీజుకు ఇస్తున్నట్లు, రిజిస్ట్రేషన్ ఫీజు మరియు స్టాంపు డ్యూటీ మినహాయింపు కల్పించినట్లు చెప్పారు. ఈ పథకం కింద రుణాలకు ప్రభుత్వ హామీ ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 1005 MPFC గోడౌన్ల పనులు ప్రారంభమై, 717 గోడౌన్లు మరియు అనుబంధ డ్రైయింగ్ యార్డులు పూర్తయ్యాయని, 572 PACSలో 1111 సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి తేమ మీటర్లు, తూనిక బ్యాలెన్స్లు, డెస్క్టాప్లు సరఫరా చేసినట్లు తెలిపారు. 232 PACSలలోని 462 అసేయింగ్ కేంద్రాలకు అవసరమైన ల్యాబ్ పరికరాలు అందించామని చెప్పారు. మొత్తం రూ.381.72 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని, అందులో గోడౌన్ల నిర్మాణానికి రూ.373.97 కోట్లు, పరికరాల సరఫరాకు రూ.7.75 కోట్లు ఖర్చయ్యాయని వెల్లడించారు. ఈ చర్యల ద్వారా రైతులకు శాస్త్రీయ నిల్వ సదుపాయాలు కల్పించి, పంటలకు మెరుగైన ధరలు సాధించే అవకాశాలు పెరుగుతున్నాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఈ పథకం కీలకంగా నిలుస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు మండలికి తెలియజేశారు.
రైతు ఆదాయం పెంపే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం:
ఆకాల వర్షాల కారణంగా పంట చేతికి వచ్చే సమయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం గుర్తించిందని, 2014–19 తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో టార్పాలిన్లు పంపిణీ చేశామని, ఆ తరువాత పంపిణీ నిలిచిపోయిందని తెలిపారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో టార్పాలిన్లు కొనుగోలు చేసి ప్రతి రైతు సేవా కేంద్రం (RSK)లో బల్క్గా నిల్వ ఉంచామని, ఇంతకుముందు వ్యక్తిగతంగా పంపిణీ చేసేవారమని, ఇప్పుడు అవసరమైన రైతులు RSKల ద్వారా తీసుకుని అవసరం తీరిన తరువాత తిరిగి ఇచ్చే విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. వ్యవసాయ రంగంలో సాంకేతికత విస్తృతంగా అభివృద్ధి చెందిందని, ఆధునిక ఎలక్ట్రానిక్ డ్రయర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ అవి అధిక వ్యయంతో ఉన్నాయని తెలిపారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో చర్చించి రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో ఒకటి లేదా రెండు చోట్ల నమూనా ప్రాతిపదికన ఎలక్ట్రానిక్ డ్రయర్లు ఏర్పాటు చేసి, ఫలితాలు అనుకూలంగా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తడి ధాన్యాన్ని శాస్త్రీయంగా ఎండబెట్టి రైతులకు మెరుగైన ధర లభించేలా చేయడం ప్రభుత్వ లక్ష్యమని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధునిక డ్రయింగ్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
