నేటి తెలుగు పత్రిక: ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కింద ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఉగాది సందర్భంగా కొత్తగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారీగా ఇళ్లను కేటాయిస్తోంది. తొలి విడతలో 3 లక్షల మందికి ఇళ్లు మంజూరు చేయగా, వాటిలో కొన్ని పూర్తై గృహప్రవేశాలు కూడా జరిగాయి. ప్రస్తుతం రెండో విడతలో పట్టణాలు, ముఖ్యంగా Hyderabad పరిధిలో నివసించే అర్హులైన పేదలకు కూడా ఇళ్లను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటోంది. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 12 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకు 18 వేల మందిని అర్హులుగా గుర్తించారు. త్వరలో వీరి దరఖాస్తులను మరోసారి పరిశీలించి తుది జాబితా ప్రకటించనున్నారు. కుటుంబ ఆదాయం, భూ యాజమాన్య పత్రాల ఆధారంగా ఎంపిక జరుగుతోంది.సొంత స్థలం లేనివారికి కూడా మల్టీస్టోరీ భవనాలు నిర్మించి ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా నగరంలో నిలిచిపోయిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను పునఃప్రారంభించనున్నారు. దాదాపు 28 వేల మందికి ఈ ఇళ్లు అందనున్నాయి. ఇప్పటికే 3 లక్షల ఇళ్లు మంజూరు చేయగా, సుమారు 2.5 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. మార్చి నాటికి వీటిని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
