“పీఎం లంక బోట్స్” ప్రాజెక్ట్తో తుఫాను బాధిత మత్స్యకారులకు నూతన ఉత్తేజం.
భీమవరం,నేటి తెలుగు పత్రిక: గోదావరి తీరం వద్ద ఉదయం వెలుగు రాకముందే మత్స్యకారుడి రోజు మొదలవుతుంది. వలలు సరిచూసుకోవడం, గాలి దిశ అంచనా వేయడం, పడవను నీటిలోకి నెట్టడం—ఇది వారి దైనందిన జీవితం. పశ్చిమ గోదావరి జిల్లాలో మత్స్యకారులకు తరతరాలుగా పడవ జీవనాధారమే కాక, వారి జీవన భాగస్వామిగా నిలిచింది. ఇటీవల వచ్చిన మొంథా తుఫాను ఆ బంధాన్ని ఒక్క రాత్రిలో ఛిన్నాభిన్నం చేసింది. అనేక మంది సంప్రదాయ మత్స్యకారులు తమ పడవలు, వలలు కోల్పోయారు. తీరానికి కొట్టుకువచ్చింది కేవలం చెక్క ముక్కలు కాదు, అవి ఆశల శిథిలాలు. రోజువారీ ఆదాయంపై ఆధారపడే కుటుంబాలు అకస్మాత్తుగా ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కొందరు కూలి పనులకు వెళ్లాల్సి వచ్చింది. మరికొందరు అప్పుగా వలలు తీసుకుని వేటకు వెళ్లాల్సి వచ్చింది.
ఈ పరిస్థితుల్లో రామకృష్ణ మిషన్ ‘పీఎం లంక బోట్స్’ ప్రాజెక్ట్ను ప్రారంభించింది. ఇది కేవలం సహాయం మాత్రమే కాదు, పునరుద్ధరణ చర్యగా రూపుదిద్దుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 300 మంది పేద మత్స్యకార కుటుంబాలకు రూ.2.10 కోట్ల విలువైన పడవలు, వలలు పూర్తి ఉచితంగా అందించనున్నారు. మొదటి దశలో 100 మందికి సుమారు రూ.70 లక్షల విలువైన సామగ్రి ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 28న జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పడవలను పంపిణీ చేయనున్నారు.
కేవలం చెక్క కాదు… నమ్మకం
మత్స్యకారుడికి పడవ అంటే నమ్మకం. అది అతడిని అనిశ్చిత జలాల్లోకి తీసుకెళ్లి, ఆశలతో తిరిగి తీరానికి తీసుకువస్తుంది. పడవ కోల్పోవడం అంటే స్వావలంబన కోల్పోవడం. కొత్త పడవ పొందడం అంటే గౌరవాన్ని తిరిగి పొందడం. ఈ ప్రాజెక్ట్ కింద తయారు చేసిన పడవలు స్థానిక పరిస్థితులకు అనుకూలంగా బలంగా తయారు చేశారు. నాణ్యమైన వలలు కూడా అందిస్తున్నారు. దీంతో మత్స్యకారులు అద్దె పడవల అవసరం లేకుండా స్వయంగా వేటకు వెళ్లగలుగుతారు. ఎక్కువసేపు వేట చేయడం, మంచి చేపల ప్రాంతాలకు చేరుకోవడం సాధ్యమవుతుంది.
ఒక పడవ… అనేక కుటుంబాలకు ఆధారం
మత్స్య వృత్తి కేవలం ఒకరి ఉపాధి కాదు. మార్కెట్లలో చేపలు అమ్మే మహిళలు, చేపలు ఎండబెట్టే కుటుంబాలు, రవాణా కార్మికులు-ఇలా అనేక మంది ఈ వృత్తిపై ఆధారపడి ఉంటారు. ఒక పడవ పునరుద్ధరించబడితే, ఒక చిన్న గ్రామ ఆర్థిక వ్యవస్థ మళ్లీ చురుకుగా మారుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా కుటుంబాల ఆదాయం పెరగడంతో పాటు పిల్లల విద్య, కుటుంబ భద్రత కూడా మెరుగుపడే అవకాశం ఉంది. అప్పుల బారిన పడే పరిస్థితులు తగ్గుతాయి.
దాతృత్వం సద్వినియోగం అవుతుందన్న నమ్మకం కలిగితే వ్యధాన్యులకు కొదవ ఉండదు: కలెక్టర్ నాగరాణి
రామకృష్ణ మిషన్ ఈ కార్యక్రమానికి ముందుకు రావటం వెనుక కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ చదలవాడ నాగరాణి కీలకంగా వ్యవహరించారు. దాతృత్వం సద్వినియోగం అవుతుందన్న నమ్మకం కలిగితే వ్యధాన్యులకు కొదవ ఉండదన్న దానిని నిజం చేశారు. రామకృష్ణ మఠం ప్రతినిధులతో పలు దఫాలుగా చర్చించి దాతల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పారదర్శక విధానాలు అమలు చేశారు. నిజంగా నష్టపోయిన మత్స్యకారులను గుర్తించేందుకు ప్రత్యేకంగా వ్యక్తిగత పరిశీలనలు నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపికలో నిష్పక్షపాతంగా వ్యవహరించి, అర్హులకే సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు. స్థానిక అధికారులతో సమన్వయం పెంచి, పనులు వేగవంతంగా పూర్తి అయ్యేలా నిరంతరం పర్యవేక్షించారు. దీంతో నిర్ణీత గడువులోనే పడవలు సిద్ధమయ్యాయి. దాతల సహాయం సక్రమంగా ఉపయోగపడుతుందన్న నమ్మకాన్ని ఈ కార్యక్రమం మరింత బలపరిచింది. ఫలితంగా ఫిబ్రవరి 28 సమీపిస్తున్న కొద్దీ లబ్ధిదారుల్లో ఉత్సాహం పెరుగుతోంది. వరుసగా నిలబెట్టిన కొత్త పడవలు వారికి కొత్త ఆరంభానికి సూచికగా మారాయి.



