హైదరాబాద్,ఫిబ్రవరి 28, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో పట్టణాభివృద్ధికి వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో చేపట్టాల్సిన సమగ్ర మార్పులపై చర్చించారు.పట్టణాల్లో శానిటేషన్, దోమల నివారణ, చెత్త నిర్వహణలో ఎక్కడా అలసత్వం ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. అవసరమైతే టెక్నాలజీ వినియోగంతో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, డ్యాష్బోర్డ్ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. కోర్ అర్బన్ రీజియన్లోని అన్ని స్ట్రీట్ లైట్లకు ప్రత్యేక నంబర్లు కేటాయించి కమాండ్ కంట్రోల్ సిస్టమ్తో అనుసంధానం చేయాలని ఆదేశించారు.
ఫుడ్ సేఫ్టీ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్ల కిచెన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్కు లింక్ చేయాలని ఆదేశించారు. ఆహార నాణ్యతపై తరచూ తనిఖీలు నిర్వహించడంతో పాటు ప్రత్యేక మానిటరింగ్ వింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. హోటళ్లకు రేటింగ్, సర్టిఫికేషన్ విధానం అమలు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు.వాణిజ్య సముదాయాల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, ఆధునిక పరికరాలు వినియోగించాలని ఆదేశించారు. అలాగే హైదరాబాద్లోని సిగ్నల్ జంక్షన్లు, సర్కిల్స్ వద్ద వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేసి వర్షపు నీటిని సంరక్షించేలా పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలని సూచించారు.మొత్తంగా పట్టణాల అభివృద్ధిలో పారదర్శకత, టెక్నాలజీ వినియోగం, ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం పేర్కొన్నారు.
