నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ విధానాలు, ఆలోచనలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లే బాధ్యత కలెక్టర్లదేనని పేర్కొన్నారు.
సచివాలయంలో కీలక సమావేశం
మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు అమలు కానున్న కార్యక్రమంపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం లో జిల్లా కలెక్టర్లతో సమావేశమై సీఎం దిశానిర్దేశం చేశారు.ఈ మూడు నెలలు ప్రతి కలెక్టర్ కెరీర్కు కొలమానమని, పనితీరును ప్రభుత్వం నిశితంగా గమనిస్తుందని హెచ్చరించారు. నెలలో కనీసం 10 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని స్పష్టం చేశారు.
పనితీరుపై సమీక్ష.. వార్షిక నివేదికల ఆధారంగా బేరీజు
కలెక్టర్ల పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేసి నివేదిక అందించాలని సీఎస్కు ఆదేశించారు. కొందరి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం, “ఆషామాషీగా ఐఏఎస్ కాలేరు.. ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే సార్థకత” అని వ్యాఖ్యానించారు. జూన్లో మళ్లీ సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
99 రోజుల యాక్షన్ ప్లాన్ ఇలా..
- గ్రామ సర్పంచులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితరుల సమన్వయంతో కార్యక్రమం అమలు
- కొత్త ప్రజా ప్రతినిధులకు మార్చి 12న ప్రత్యేక శిక్షణ
- ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ను నోడల్ అధికారిగా నియామకం
- జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహణ
సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి
గ్రామ, వార్డు సభల్లో కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఉచిత బస్ ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్ వంటి పథకాల లబ్ధిదారుల వివరాలు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ప్రతి పథకానికి ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి చేయాలని ఆదేశించారు. ఆసరా పింఛన్లలో ఇప్పటికే లక్షల మంది అనర్హులను గుర్తించామని వెల్లడించారు.
పాఠశాలలు, ఆసుపత్రులపై ఫోకస్
రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని, కలెక్టర్లు వారానికి ఒకసారి భోజనం చేయాలని సూచించారు. జూన్ 12న విద్యా సంవత్సరం ప్రారంభ రోజునే పుస్తకాలు, యూనిఫామ్లు అందించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను తరచూ సందర్శించాలని, వైద్య సేవల్లో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. సీఎంఆర్ఎఫ్, ఆరోగ్యశ్రీ పథకాలపై ఏటా రూ.2500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
అక్రమాలపై కఠిన చర్యలు
- ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్పై కఠిన చర్యలు
- మిల్లర్ల వద్ద ఉన్న ధాన్యం వెనక్కి రాబట్టాలి
- బోగస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలపై ఆడిట్ చేసి కేసులు నమోదు
- భూభారతి దరఖాస్తులు గడువులోగా పరిష్కారం
రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, రీజనల్ రింగ్ రోడ్, ఎయిర్పోర్టుల భూసేకరణ వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.
మొత్తానికి 99 రోజుల ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసి ప్రభుత్వం-ప్రజల మధ్య వారధిగా నిలవాలని కలెక్టర్లకు సీఎం స్పష్టం చేశారు.


