నేటి తెలుగు పత్రిక: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ఆదేశాల మేరకు మార్చి 2 నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తోంది.ఇప్పటివరకు మస్టర్ రోల్ ద్వారా హాజరు నమోదు చేసేవారు. ఇక నుంచి కూలీలు పని ప్రదేశంలో ముఖ హాజరు నమోదు చేయాలి. లేకపోతే వేతనం జమ కావడం లేదు.
ఎందుకు ఈ మార్పు?
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో కొంతమంది పనికి రాకపోయినా హాజరు వేసుకుని డబ్బులు పొందుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దుర్వినియోగానికి చెక్ పెట్టేందుకు ఫేషియల్ అథెంటికేషన్ను తప్పనిసరి చేసింది.
ఎలా పనిచేస్తుంది?
- ప్రతి కూలీకి ప్రత్యేక ఐడీ సృష్టిస్తారు
- పని ప్రారంభంలో ఒకసారి ఫొటో తీస్తారు
- పని ముగిసిన తర్వాత మళ్లీ ఫొటో తీస్తారు
- యాప్ ద్వారా ఫేషియల్ మ్యాచ్ అయ్యాకే హాజరు నమోదు అవుతుంది
ఈకేవైసీ తప్పనిసరి
జాబ్ కార్డు కలిగిన ప్రతి కూలీ ఈకేవైసీ పూర్తి చేయాలి. 2025 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమై మెజారిటీ కూలీలు ఇప్పటికే పూర్తి చేశారు. ఈకేవైసీ లేకుంటే అటెండెన్స్ నమోదు కావదు.
సిగ్నల్ సమస్యలు
కొన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ సిగ్నల్ సమస్యలు తలెత్తుతున్నాయి. అలాంటి సందర్భాల్లో పని ప్రదేశంలో ఫొటోలు తీసి, సిగ్నల్ ఉన్న ప్రాంతంలో అప్లోడ్ చేయాలని అధికారులకు సూచనలు ఇచ్చారు.మొత్తంగా ఉపాధి హామీ పథకంలో పారదర్శకత పెంచేందుకు, అవకతవకలు నివారించేందుకు ఈ ఫేషియల్ అటెండెన్స్ విధానం అమల్లోకి వచ్చింది.
