అమరావతి, Mar 06, 2026, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న తల్లికి వందనం పథకం పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి ఆర్థిక సాయం అందించడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ పథకం కింద ఇప్పటివరకు రాష్ట్రంలో 67,01,653 మంది విద్యార్థులకు మొత్తం రూ.8,454 కోట్ల మేర సాయం అందించినట్లు వెల్లడించారు.
విద్య కోసం ఏకీకృత జిల్లా సమాచార వ్యవస్థ (యూడైస్) ప్రకారం రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 79,51,903 మంది విద్యార్థులు నమోదై ఉన్నారని తెలిపారు. వీరిలో అర్హత ఉన్న వారిలో సుమారు 84 శాతం మందికి తల్లికి వందనం పథకం ద్వారా సాయం అందించామని మంత్రి పేర్కొన్నారు.అర్హత ఉన్నప్పటికీ సాయం అందని వారు ఉంటే వారి వివరాలు ఇవ్వాలని లోకేష్ కోరారు. అటువంటి సమస్యలను పరిశీలించి అర్హులందరికీ సాయం అందించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.విద్యార్థుల చదువుకు ఆర్థిక భారం తగ్గించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.
