అమరావతి,Mar 06, 2026, నేటి తెలుగు పత్రిక: నేటి డిజిటల్ యుగంలో చిన్న పిల్లలు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు బానిసలవుతున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. పిల్లల మానసిక ఆరోగ్యం, భవిష్యత్తు దృష్ట్యా 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
పిల్లలు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్లలో గడపడం వల్ల చదువుపై ప్రభావం పడటంతో పాటు మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్నారులపై సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించేలా ప్రత్యేక విధానాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం కూడా చిన్న పిల్లల సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ తీసుకురావాలనే ఆలోచనలో ఉంది. అదే విధంగా ఏపీ ప్రభుత్వం కూడా నిపుణుల సూచనలు, ఇతర రాష్ట్రాల అనుభవాలను పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశముంది.పిల్లలు డిజిటల్ ప్రపంచాన్ని బాధ్యతాయుతంగా ఉపయోగించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అవసరమైన నియంత్రణ చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
