హైదరాబాద్,mar 07, నేటి తెలుగు పత్రిక: సాయుధ మిలిటెంట్ పోరాటపంథాలో ఒకప్పుడు బలంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (Maoist) ప్రస్తుతం తీవ్ర దెబ్బతిన్న పరిస్థితిలో ఉంది. ఎన్కౌంటర్లు, భద్రతా దళాల ఆపరేషన్లు, మరోవైపు భారీ స్థాయిలో లొంగుబాట్లతో ఆ పార్టీ కార్యకలాపాలు క్షీణిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రేవంత్ రెడ్డి సమక్షంలో హైదరాబాద్లోని తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వద్ద భారీ స్థాయిలో మావోయిస్టులు లొంగిపోయారు.ఇటీవల లొంగిపోయిన కీలక నేత దేవ్జీ, అలాగే మల్ల రాజిరెడ్డి గ్రూపులకు చెందిన PLGA కమిటీ సభ్యులు సహా మొత్తం 130 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో పోలీసుల ముందు సరెండర్ అయ్యారు. వీరి వద్ద నుంచి 31 ఏకే-47 రైఫిళ్లతో పాటు మొత్తం 124 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద మావోయిస్టుల లొంగుబాటుగా పోలీసులు పేర్కొంటున్నారు.
లొంగిపోయిన వారిలో కీలక నేతలు దేవ్జీ, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి, మల్లా రాజిరెడ్డి గన్మెన్లు కూడా ఉన్నారు. మావోయిస్టులను నాలుగు బస్సుల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్కు తీసుకువచ్చి అధికారికంగా సరెండర్ ప్రక్రియ నిర్వహించారు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, లొంగిపోయిన వారిలో 130 మంది ఛత్తీస్గఢ్కు చెందినవారు కాగా, నలుగురు తెలంగాణకు, ఒకరు ఆంధ్ర ప్రదేశ్కు చెందినవారు ఉన్నారు.
లొంగిపోయిన వారిలో ముగ్గురు స్టేట్ కమిటీ సభ్యులు, 10 మంది డివిజినల్ కమిటీ సభ్యులు, 40 మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారని తెలిపారు. అలాగే మావోయిస్టు పార్టీకి చెందిన కంప్యూటర్ సిగ్నల్ ఆపరేటర్లు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకు చెందిన బెటాలియన్ సభ్యులు కూడా సరెండర్ అయినట్లు వెల్లడించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఇటీవలి కాలంలో మావోయిస్టులు ఒక్కొక్కరుగా లొంగిపోతున్నారని, భవిష్యత్తులో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.
