నేటి తెలుగు పత్రిక,mar 08: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. మహిళల పాత్ర సృష్టిలో అత్యంత గొప్పదని ఆయన పేర్కొన్నారు.“అమ్మా! నీవు ఆకాశంలో సగం కాదు.. నింగీ నేల నీవే. ఈ సృష్టి మీది, మా జన్మ మీది. అమ్మ జన్మనిస్తే జీవితాంతం అమ్మమ్మ, నాన్నమ్మ, అక్క, చెల్లి, భార్య, అత్త, పెద్దమ్మ, పిన్ని, వదిన, మరదలు రూపంలో మనల్ని కంటికి రెప్పలా కాచే మాతృమూర్తులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు” అని మంత్రి లోకేష్ తెలిపారు.
మహిళలను గౌరవించాలనే గొప్ప నైతిక విలువలను తన తల్లి ద్వారా చిన్నప్పటి నుంచే నేర్చుకున్నానని చెప్పారు. తన తాత తెలుగింటి ఆడపడుచులకు అన్నగా నిలిచి ఆస్తి హక్కు కల్పించారని గుర్తుచేశారు. తన తండ్రి మహిళా సాధికారత కోసం స్వయం సహాయక సంఘాలను ప్రారంభించారని అన్నారు.ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఒక మహిళా పారిశ్రామికవేత్తను తయారు చేసే విధంగా ప్రభుత్వం పలు ప్రణాళికలు అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. స్త్రీశక్తి, తల్లికి వందనం వంటి పథకాల ద్వారా మహిళలకు గౌరవం కల్పిస్తున్నామని తెలిపారు.
పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు చాగంటి కోటేశ్వరరావును నైతిక విలువల సలహాదారుగా నియమించామని, ఆయన మార్గదర్శకత్వంలో విద్యా వ్యవస్థలో నైతిక విలువలను పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టామని చెప్పారు.అలాగే పాఠ్యపుస్తకాలలో స్త్రీ–పురుష సమానత్వాన్ని ప్రతిబింబించే చిత్రాలను మాత్రమే ఉపయోగిస్తున్నామని తెలిపారు. మహిళలను కించపరిచే మాటలు, భావజాలం సమాజంలో ఉండకూడదని, సినిమాలు, సీరియల్స్, వెబ్సిరీస్లలో కూడా మహిళలను అవమానించే భాష లేదా సన్నివేశాలు ఉండకూడదని తాను పోరాడుతున్నానని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళల శక్తికి, సహనానికి, అనురాగానికి వందనాలు తెలియజేస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు నారా లోకేష్.
