జగద్గురువుల అమృత హస్తాలతో సంప్రోక్షణ
భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినా ప్రభుత్వ యంత్రాంగం
ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం లో ముగిసిన కుంభాభిషేక మహోత్సవాలు
విజయవాడ దుర్గగుడి,మార్చి 8,నేటి తెలుగు పత్రిక: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో గత మూడు రోజులుగా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవాలు నేడు (ఆదివారం) అత్యంత వైభవంగా ముగిశాయి లోక కల్యాణం కోసం, విశ్వశాంతి కోసం చేపట్టిన ఈ పవిత్ర క్రతువు భక్తుల జయజయధ్వానాల మధ్య, వేద మంత్రోచ్ఛారణలతో అంగరంగ వైభవంగా ముగింపు వేడుకలు.ఆదివారం ఉదయం యాగశాలలో మంటప పూజలు, మూలమంత్ర హవనములతో కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయం 9 గంటలకు నిర్వహించిన పూర్ణాహుతితో యాగం పరిసమాప్తమైంది అనంతరం నిర్ణీత మేష లగ్న పుష్కర ముహూర్తాన (ఉదయం 9:34 నిమిషాలకు) శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారి అమృత హస్తాలతో ప్రధాన *ఆలయ శిఖర విమానగోపురమునకు కుంభాభిషేకం నిర్వహించారు.
*అనేక పుణ్యనదుల జలాలు, సముద్రోదకములతో..నిర్వహించిన ఈ సంప్రోక్షణ తిలకించి భక్తులు పులకించిపోయారు.పాల్గొన్న ప్రముఖులు ఈ చారిత్రాత్మక ఘట్టంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి , దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా. ఎం. హరి జవహర్ లాల్, దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ గారు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వారితో పాటుగా ఆలయ ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు వేద పండితులు ఈ మహత్తర క్రతువులో పాల్గొని శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
జగద్గురువుల అనుగ్రహ భాషణము
కుంభాభిషేకం అనంతరం రాజగోపురం ప్రాంగణంలోని కళావేదికపై కంచి స్వామివారు అనుగ్రహ భాషణము చేశారు కుంభాభిషేకం విశిష్టతను, 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ క్రతువు వల్ల కలిగే ఆధ్యాత్మిక శక్తిని భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.ముగింపు సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, కుంభాభిషేకం ద్వారా ఆలయ తేజస్సు మరింత పెరిగిందని ఆకాంక్షించారు.


