నేటి తెలుగు పత్రిక,mar 09: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ జిల్లాను అద్భుతమైన వాటర్ హబ్గా అభివృద్ధి చేశామని మాజీ మంత్రి టి. హరీష్ రావు తెలిపారు. కె. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి జిల్లాలో నీటి సమస్యలను పరిష్కరించామని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం ఎ. రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని పదేపదే అబద్ధాలు చెబుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. ఇటీవల కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో భాగమైన లక్ష్మీ పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసి వరద కాలువలకు నీళ్లు వదిలారని తెలిపారు.అప్పుడు వరద కాలువల్లో ప్రవహిస్తున్న నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు కావా అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరంలో భాగమైన లక్ష్మీ పంప్ హౌస్ మోటార్లు నడుస్తున్నప్పుడే ఆ నీరు వస్తుందని స్పష్టం చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేయకుండా వాస్తవాలను ప్రజలకు చెప్పాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు.
