ఏలూరు,mar 10: నేటి తెలుగు పత్రిక: పోలవరం లో సాగుతున్న పోలవరం ప్రాజెక్టు పనులపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం సహా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులను క్రమపద్ధతిలో పూర్తి చేయడానికి ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిందని తెలిపారు.ఇరిగేషన్ రంగానికి గతంలోనూ, ప్రస్తుతం కూడా పెద్దపీట వేసింది కూటమి ప్రభుత్వమేనని మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణ నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు స్పష్టంగా సూచించారని చెప్పారు.
గత ప్రభుత్వ కాలంలో కీలకమైన డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని గుర్తుచేసిన మంత్రి, నాణ్యత మరియు ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టామని తెలిపారు. సెంట్రల్ వాటర్ కమిషన్ రూపొందించిన డిజైన్ల ప్రకారమే పోలవరం పనులు జరుగుతున్నాయని చెప్పారు.అంతర్జాతీయ నిపుణుల ప్యానల్ సూచనలను అనుసరిస్తూ పనులు కొనసాగుతున్నాయని, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రతిరోజూ పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నదని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం కొత్త డయాఫ్రం వాల్ మొత్తం 1372 మీటర్లలో 1300 మీటర్లు పూర్తయ్యాయని, ఈ నెలాఖరుకు పూర్తిచేస్తామని తెలిపారు.
అలాగే ఈసిఆర్ఎఫ్ డ్యాం ప్రాంతంలో నేలను గట్టిపరచేందుకు వైబ్రో కాంప్యాక్షన్ పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది జూన్ నాటికి కుడి, ఎడమ కాలువల అనుసంధాన పనులు కూడా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు.నిర్వాసితులకు పరిహారం చెల్లింపుల విషయమై మాట్లాడుతూ, 2016లో రూ.700 కోట్ల పరిహారం అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరో రెండు దఫాల్లో రూ.1900 కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంపై వచ్చే సూచనలు, విమర్శలను స్వీకరిస్తామని, కానీ నాణ్యత మరియు భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.



