బుగ్గన భూకబ్జా ఫిర్యాదుపై విచారణకు ఆదేశాల
నంద్యాల,మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు డోన్ నియోజకవర్గంలోని కొత్తబురుజు గ్రామంలో పర్యటించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హార్టికల్చర్ పంటల ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ప్యాపిలీ మండలానికి చెందిన రైతు పొలెం రామచంద్ర తన భూమిని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆక్రమించారని సీఎంకు ఫిర్యాదు చేశారు. దాదాపు 110 ఏళ్లుగా తమ ఆధీనంలో ఉన్న భూమిని బుగ్గన తన అనుచరుల పేర్లకు మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లకు పలుమార్లు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు.
రైతు ఆవేదనపై స్పందించిన సీఎం చంద్రబాబు వెంటనే ఆర్డీవోను పిలిపించి సమస్యపై విచారణ చేసి త్వరగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. బాధితుడికి న్యాయం చేయకుండా ఎందుకు తిప్పించుకుంటున్నారని అధికారులను ప్రశ్నించారు. భూకబ్జా జరిగినట్టు తేలితే ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
జగన్ హయాంలో అమలులోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ భూమి హక్కు చట్టం కారణంగా లక్షల ఎకరాల భూములు ఇష్టారాజ్యంగా మార్పులు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల ముందు ఈ చట్టాన్ని రద్దు చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేశామని తెలిపారు.రైతుల భూములను ఎవరైనా ఆక్రమిస్తే చాలా కఠినంగా శిక్షిస్తామని సీఎం హెచ్చరించారు. ప్రజల మధ్యనే సమస్యలను పరిష్కరించే విధానాన్ని ఇకపై కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఎంత పెద్దవారైనా తప్పు చేస్తే ప్రజల ముందే నిలబెడతామని తెలిపారు.
