మార్చి 14(నేటి తెలుగు పత్రిక): జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ సందర్భంగా శనివారం పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజనుల మధ్య ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.పాడేరు నియోజకవర్గంలోని నందిగరువు గ్రామంలో జరిగే కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొంటారు. ముందుగా ఓనూరు జంక్షన్ వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం ప్రధాన మంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాల నిధులతో ఏజెన్సీ ప్రాంతంలో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తారు.ఓనూరు జంక్షన్ నుంచి నందిగరువు వరకు నిర్మించిన సుమారు 2.4 కిలోమీటర్ల రహదారిని కాలినడకన పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా మార్గమధ్యంలో గిరిజనులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు.అనంతరం ‘అడవితల్లి బాట’ కార్యక్రమం కింద నిర్మించిన రోడ్లను ప్రారంభించనున్నారు. తర్వాత నందిగరువులో గిరిజనులతో మాటామంతి కార్యక్రమంలో పాల్గొని వారితో కలిసి భోజనం చేయనున్నారు.
