మార్చ్ 14(నేటి తెలుగు పత్రిక): చల్లపల్లిలో జరిగిన దాడి ఘటన నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులు ముప్పిరిశెట్టి జగదీష్, అల్లుడు నెరుసు శివగోపాల్ శుక్రవారం రాత్రి విజయవాడలో రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్ధన్ ను కలిశారు. తమకు, తమ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని వారు కోరారు.చల్లపల్లిలో తమ ఇంటిని కిరాయి మూకలతో ధ్వంసం చేయించారని, తన తల్లి ముప్పిరిశెట్టి రాణితో పాటు తమకు భద్రత కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. దాడి చేసిన వారిని, దాడి చేయించిన వారిని వెంటనే అదుపులోకి తీసుకుని పోలీసులు తమకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాపు జేఏసీని అభ్యర్థించారు.ఈ సందర్భంగా స్పందించిన చందు జనార్ధన్, చల్లపల్లి ఘటనలో ముప్పిరిశెట్టి రాణి కుటుంబానికి రాష్ట్ర కాపు జేఏసీ అండగా ఉంటుందని తెలిపారు. ఇంటి ధ్వంసం, మూకుమ్మడి దాడి, హత్యాయత్నం ఘటనలపై బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించేలా రాష్ట్ర కాపు జేఏసీ తరఫున ఆందోళన కొనసాగిస్తామని వారికి హామీ ఇచ్చారు.

