మార్చ్ 14 (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ఆర్టీసీలో సమ్మె ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) కార్మికులు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం (మార్చి 13) ఆర్టీసీ ఉన్నతాధికారులకు అధికారికంగా నోటీసులు అందజేశారు.విధిలేని పరిస్థితుల్లోనే సమ్మె నోటీసు ఇవ్వాల్సి వచ్చిందని జేఏసీ నాయకులు తెలిపారు. ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న నేతృత్వంలో కార్మికులు బస్ భవన్ లో అధికారులను కలిసి తమ డిమాండ్లను వివరించారు.
కార్మికుల ప్రధాన డిమాండ్లు
- ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి
- 2021 వేతన సవరణను 30% ఫిట్మెంట్తో అమలు చేయాలి
- ప్రభుత్వానికి చెందిన పాత బకాయిలను ఆర్టీసీకి వెంటనే విడుదల చేయాలి
- కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
- ట్రేడ్ యూనియన్లపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలి
- ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించాలి
- అన్ని కేటగిరీల్లో ఉన్న సిబ్బందిపై అధిక పనిభారం తగ్గించాలి
అలాగే మహిళలకు ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం తెలంగాణ కింద ఆర్టీసీకి రావాల్సిన నిధులను కోత లేకుండా చెల్లించాలని కూడా జేఏసీ నేతలు డిమాండ్ చేశారు.ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు.
