మార్చి 14(నేటి తెలుగు పత్రిక): మహిళలు, బాలికల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్భయ నిధి కింద తెలంగాణలోని ములుగు జిల్లా ఎంపికైంది. మహిళలు, బాలికల కోసం చేపట్టిన సమ్మిళిత నగరాలు కార్యక్రమంలో భాగంగా ఈ జిల్లాను ఎంపిక చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ సందర్భంగా తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కహర్షం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ లో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు
ఈ ప్రాజెక్ట్ ద్వారా ములుగు జిల్లాలో
- మహిళలు, బాలికల భద్రతను బలోపేతం చేయడం
- జెండర్ రెస్పాన్సివ్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు
- ఆధునిక నిఘా వ్యవస్థలు
- అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలు
వంటి చర్యలు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్ అమలుకు సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సిద్ధం చేయడానికి జిల్లా యంత్రాంగంతో కలిసి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పనిచేస్తుందని మంత్రి తెలిపారు.
క్రెచ్ వర్కర్ల వేతనాల పెంపుపై విజ్ఞప్తి
అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్నా పథకం (మిషన్ శక్తి) కింద పనిచేస్తున్న క్రెచ్ వర్కర్లు, హెల్పర్ల గౌరవ వేతనాలను పెంచాలని మంత్రి సీతక్క కేంద్రాన్ని కోరారు.
ప్రస్తుతం
- క్రెచ్ వర్కర్లకు నెలకు రూ.5,500
- హెల్పర్లకు రూ.3,000
మాత్రమే ఇస్తున్నారని, ఇది వారి బాధ్యతలకు సరిపడదని తెలిపారు. ఒక క్రెచ్లో దాదాపు 25 మంది పిల్లల సంరక్షణ బాధ్యత ఉండటంతో వేతనాలను పెంచాలని విజ్ఞప్తి చేశారు.మహిళల భద్రత, శిశు సంక్షేమాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
