- కొరత సమస్య లేకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు
- మంత్రుల బృందం, ప్రత్యేక అధికారుల బృందాలు నిరంతర పర్యవేక్షణ
- కష్టం, నష్టాన్ని తగ్గించేందుకు ముమ్మర ప్రయత్నాలు
- సరఫరా వ్యవస్థల పునరుద్ధరణ, బలోపేతానికి కృషి
- వంట గ్యాస్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు
- ఆసుపత్రులు, హాస్టళ్ల కార్యకలాపాలకూ ప్రాధాన్యం
- రియల్ టైమ్ డేటా విశ్లేషణతో ప్రణాళికాయుత చర్యలు
- బ్లాక్ మార్కెటింగ్ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
- వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి
- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
మార్చి 14(నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరా విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజలకు ఇబ్బంది లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని, మంత్రుల బృందం (జీవోఎం) నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.శనివారం కానూరులోని పౌర సరఫరాల రాష్ట్ర కార్యాలయంలో మంత్రులు పయ్యావుల కేశవ్, కింజరాపు అచ్చెన్నాయుడు, వర్చువల్గా నాదెండ్ల మనోహర్.. పౌర సరఫరాలు, సమాచార, పౌర సంబంధాలు, పోలీస్, విజిలెన్స్ తదితర సమన్వయ శాఖల అధికారులతో పాటు ఐవోసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ తదితర ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్పీజీ రోజువారీ అవసరాలు, సరఫరా స్థితిగతులతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. రియల్ టైమ్ డేటా విశ్లేషణ ఆధారంగా పటిష్ట కార్యాచరణతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్.. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులతో కలిసి మీడియాతో మాట్లాడారు.
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గౌరవ ప్రధాని నేతృత్వంలో కేంద్రం, గౌరవ సీఎం నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రుల బృందంతో పాటు అధికారుల బృందాలు నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ పటిష్ట కార్యాచరణతో ముందుకెళ్తూ భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. వదంతులు నమ్మవద్దని కోరారు. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం కారణంగా, నౌకల రవాణాకు ఆటంకం వల్ల సరఫరా వ్యవస్థలో సమస్యలు ఉత్పన్నమయ్యాయని.. అయితే వ్యవస్థల పునరుద్ధరణకు, బలోపేతానికి, కొత్త మార్గాల అన్వేషణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, కేంద్రం మార్గదర్శకాలతో రాష్ట్ర స్థాయిలో చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇతర పెట్రోలియం ఉత్పత్తులను తగ్గించి, గ్యాస్ ఉత్పత్తిని పెంచాలని కేంద్రం దేశవ్యాప్త రిఫైనరీలను ఆదేశించిందని, దీనివల్ల ఉత్పత్తి 10 శాతం నుంచి 20 శాతం వరకు పెరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా కుటుంబాలపై ప్రభావం పడకుండా వంట గ్యాస్ సరఫరాకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు. ఆసుపత్రులు, వసతిగృహాల కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. గ్యాస్ సిలిండర్లపై కేంద్రం కొన్ని పరిమితులు విధించిందని.. ప్రస్తుతానికి పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు, డబుల్ సిలిండర్లు ఉన్నవారికి 32 రోజులకు సిలిండర్ పొందేలా మార్గదర్శకాలు ఉన్నాయన్నారు. అనవసరంగా ఆందోళనకు గురికావద్దని, కష్టాన్ని, నష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు.
బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడితే కఠిన చర్యలు:
విపత్కర పరిస్థితులను లాభార్జన కోసం ఉపయోగించుకోవాలనే తలంపుతో ఎవరైనా బ్లాక్ మార్కెటింగ్ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గౌరవ సీఎం ఆదేశాలతో ప్రత్యామ్నాయాలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే హోటళ్లు, గ్యాస్ డీలర్లు తదితర అసోసియేషన్లతో సమావేశాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. విపత్కర కాలంలో వివిధ రకాల వినూత్న ఆప్షన్లను ముందుకు తీసుకొస్తున్నారన్నారు. ప్రజల సలహాలు, సూచనలను కూడా స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 95 శాతం ఆన్లైన్ బుకింగ్లు జరుగుతున్నాయని, 88 శాతం వరకు ఓటీపీ ఆధారిత గ్యాస్ సిలిండర్ల డెలివరీలు జరగుతున్నాయని.. ఈ శాతాన్ని పెంచాలని సంస్థలకు సూచించామన్నారు. ఆర్టీజీఎస్ తో పాటు కలెక్టర్ల కార్యాలయాల్లోనూ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పైప్డ్ గ్యాస్పై ప్రత్యేక దృష్టి:
ప్రత్యామ్నాయ వనరులను ఉపయోగించుకోవడంలో భాగంగా పైప్డ్ గ్యాస్పైనా ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్ల మంత్రి తెలిపారు. గతంలో గౌరవ ముఖ్యమంత్రి దార్శనికతతో విజయవాడతో పాటు వివిధ నగరాల్లో విజయవంతంగా నడుస్తున్న పైప్డ్ గ్యాస్ నేడు వరంగా మారాయని పేర్కొన్నారు. నేచురల్ గ్యాస్ను సమర్థవంతంగా వినియోగించుకునే విషయంపై ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే దృష్టిసారించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు.సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్, డైరెక్టర్ శ్రీవాస్ నుపుర్ అజయ్కుమార్, సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కేఎస్ విశ్వనాథన్, సమన్వయ శాఖల ఉన్నతాధికారులు, చమురు సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.









