మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ‘అన్నదాత సుఖీభవ’ మూడో విడత నిధుల విడుదల సందర్భంగా కృష్ణా జిల్లా సూరంపల్లి లో పర్యటించారు. గన్నవరం నియోజకవర్గంలోని ఈ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, స్థానిక రైతుల పంటలను ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా స్థానిక రైతు తోట వడ్డీకాసులు సాగు చేస్తున్న టమోటా, వంకాయ పంటలను ముఖ్యమంత్రి పరిశీలించారు. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతితో సాగు చేస్తున్న వంగ తోటను కూడా ఆయన సందర్శించారు. రైతు కుటుంబంతో మాట్లాడిన ఎన్.చంద్రబాబు నాయుడు పంట సాగుకు అయ్యే పెట్టుబడి, దిగుబడి వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు.రెండు ఎకరాల్లో వంకాయ పంటను సాగు చేస్తున్నట్లు రైతు వడ్డీకాసులు సీఎంకు వివరించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, మార్కెట్ పరిస్థితులపై కూడా సీఎం ఆరా తీశారు. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు మరింత ప్రయోజనకరంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు.

