మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): దేశంలోని గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో ఇటీవల భారత్లో నెలకొన్న ఎల్పీజీ కొరత త్వరలోనే తీరనుందని వెల్లడించింది. యుద్ధ పరిస్థితుల కారణంగా హార్ముజ్ జలసంధి వద్ద నిలిచిపోయిన LPG సరఫరా నౌకలు ఇప్పుడు సురక్షితంగా భారత తీరానికి చేరుకుంటున్నాయి.ఈ నేపథ్యంలో శివాలిక్ అనే ఎల్పీజీ నౌక గుజరాత్లోని ముంద్రా పోర్టుకు సురక్షితంగా చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నౌకలో సుమారు 48 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ నిల్వ ఉన్నట్లు సమాచారం. ఈ సరఫరాతో దేశంలోని పలు రాష్ట్రాల్లో గ్యాస్ కొరత తగ్గే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా బుధవారం మరో ఎల్పీజీ నౌక కూడా ముంద్రా పోర్టుకు చేరుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వరుసగా నౌకలు చేరుకోవడంతో దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు.ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ రవాణాపై ప్రభావం పడినా, దేశంలో గ్యాస్ కొరత రాకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. దీంతో వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.
