మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేసినప్పటికీ, రైతులకు సరైన ధర దక్కడం లేదని విమర్శించారు.పంట మార్కెట్కు వచ్చి 15 రోజులు గడిచినా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టపోతున్నారని అన్నారు.ప్రభుత్వం ప్రకటించిన రూ. 2400 మద్దతు ధర ఉండగా, రైతులు దళారులకు రూ. 1600–1700కే అమ్ముకుంటున్నారని తెలిపారు. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి
- మద్దతు ధరకు మొక్కజొన్న కొనుగోలు చేయాలి
- రైతులను దళారుల బారినుంచి కాపాడాలి
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన కోరారు.
