మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు, ఇంచార్జి మంత్రులతో నారా చంద్రబాబు నాయుడు రాత్రి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ వ్యవహారాలు, ముఖ్యంగా నాయకుల క్రమశిక్షణ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది.ఈ సందర్భంగా పుట్టా మహేష్ యాదవ్ వ్యవహారాన్ని సీఎం ప్రస్తావించినట్లు సమాచారం. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారని భావించి ఆయనకు అవకాశం ఇచ్చామని, అయితే ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోయారని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.“ఇతర పార్టీలకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేలా ఎందుకు వ్యవహరించారు?” అంటూ సీఎం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. పార్టీకి నష్టం కలిగించే చర్యలను ఏ మాత్రం సహించబోమని స్పష్టం చేశారు.గతంలో కూడా క్రమశిక్షణ ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకున్నామని గుర్తుచేస్తూ, భవిష్యత్తులో కూడా అలాంటి చర్యలపై ఎలాంటి ఉపేక్ష ఉండదని హెచ్చరించారు. రాజకీయాల్లో విలువలు, క్రమశిక్షణ చాలా ముఖ్యమని, వాటిని పాటించకుండా ముందుకు వెళ్లడం సరైంది కాదని సీఎం పేర్కొన్నారు.ఈ సమావేశం ద్వారా పార్టీ నేతలకు స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
