బెల్లంపల్లి, మార్చి 20 (నేటి తెలుగు పత్రిక): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామానికి చెందిన ఆ ఇళ్ల మల్లేష్ (55) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. మృతుని బావ మరిది గుడిసెల శేఖర్ కుటుంబ సభ్యులను నేత్రదానానికి ఒప్పించారు. మృతుని కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో ఉండి మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో నేత్రదానం చేయడానికి ముందుకు వచ్చారు. జనహిత సేవాసమితి, సదాశయ ఫౌండేషన్ సహకారంతో ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ సిబ్బందికి నేత్రాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఐ బ్యాంక్ సిబ్బంది ప్రతాప్ మృతుడు మల్లేష్ నేత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా జనహిత సేవాసమితి అధ్యక్షులు ఆడెపు సతీష్ మాట్లాడుతూ సమాజ హితం కోసం పుట్టెడు దుఃఖంలో ఉన్న మల్లేష్ భార్య పద్మ, కుమారుడు సాయి తేజ, కుమార్తెలు ప్రీతి ,ప్రియాంకలు నేత్రదానానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. జనహిత సేవాసమితి తరపున ఇది 13వ నేత్రదాన కార్యక్రమం అని చెప్పారు. మృతుడు మల్లేష్ కుటుంబ సభ్యుల స్ఫూర్తితో ప్రజలు నేత్ర అవయవ, శరీర దానాలకు ముందుకు వచ్చి సమాజానికి ఉపయోగపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నాతరి మూర్తి, జనహిత సేవాసమితి ప్రధాన కార్యదర్శి ఇప్పరవి, సహాయ కార్యదర్శి గుడిసెల శేఖర్, గుమ్ముల చందు, కార్యవర్గ సభ్యులు భీమిని కనకయ్య, మృతుని బంధువులు పాల్గొన్నారు.

