బెల్లంపల్లి, మార్చి 20 (నేటి తెలుగు పత్రిక): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామంలో శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు గ్రామస్తులు సంసిద్ధమయ్యారు. గ్రామంలో ప్రతిఏటా సీతారాముల కల్యాణ వైభోగాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. గ్రామమంతా ఏకతాటిపై నిలబడి ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా చేపడతారు. ఈసారి కూడా గ్రామంలో వైభవోపేతంగా సీతారాముల కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని నిర్వహించేందుకు గ్రామస్తులు అన్ని చర్యలు చేపడుతున్నారు. స్థానికంగా ఉన్న పాత బెల్లంపల్లి, బుచ్చయ్యపల్లి, లింగాపూర్, శాంతిఖని ప్రాంతాల నుండి గ్రామంలో జరిగే సీతారాముల కల్యాణ వేడుకలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి చందాలు సేకరిస్తున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తులకు త్రాగునీటి సౌకర్యంతో పాటు ఎక్కడ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
