బెల్లంపల్లి, మార్చి 20 (నేటి తెలుగు పత్రిక): మంచిర్యాల జిల్లా నెన్నల్ మండల కేంద్రంలో చేపడుతున్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టికలు, తరగతి గదులు, పాఠశాల పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడుతూ వారి అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించారు. పాఠశాలలో ఉన్న సౌకర్యాలను తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు శుద్ధమైన త్రాగునీటిని, నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. గ్రామంలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రవళిక కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని కోరారు. మండల కేంద్రంలోని చిత్తాపూర్ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను పరిశీలించారు. విద్యార్థినీల ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలని ఆదేశించారు. విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.
