మార్చి 20, నేటి తెలుగు పత్రిక: రంజాన్ మాసం ఆఖరి పర్వదినమైన ‘ఈద్-ఉల్-ఫితర్’ సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారు ముస్లిం సహోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ప్రారంభం నుంచి చివరి రోజు వరకు ప్రతి రోజూ ప్రత్యేక దైవ ప్రార్థనలు, ఉపవాస దీక్షలు, భక్తి శ్రద్ధలతో ముస్లింలు పవిత్ర రంజాన్ మాసాన్ని ఆచరిస్తారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పరస్పర శాంతి, సహనం, సౌభ్రాతృత్వం, ప్రేమాభిమానాలు పరిమళిస్తాయని కేసీఆర్ పేర్కొన్నారు. లౌకికవాద విలువలకు ప్రాధాన్యతనిస్తూ, విభిన్న మతాల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తూ, గంగా-జమున తెహజీబ్కు ప్రతీకగా బీఆర్ఎస్ పాలన కొనసాగిందని తెలిపారు. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం, ప్రగతి కోసం విద్య తదితర రంగాల్లో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వారి జీవన విధానంలో గుణాత్మక మార్పుకు దోహదం చేశాయని కేసీఆర్ అన్నారు. ప్రగతి తిరిగి పుంజుకుని, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఈ సందర్భంగా కేసీఆర్ ఆకాంక్షించారు.
