హైదరాబాద్, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజయం కోసం తాను చేసిన మొక్కు నెరవేరిందని సినీ నిర్మాత అట్లూరి నారాయణ రావు తెలిపారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి ఆత్మీయతను ఆయన హృదయపూర్వకంగా కొనియాడారు. హైదరాబాద్లో నారా భువనేశ్వరి ఆహ్వానం మేరకు కుటుంబ సమేతంగా ఆమెను కలిసిన అట్లూరి నారాయణరావు, ఆమె చూపిన వాత్సల్యానికి భావోద్వేగానికి లోనయ్యారు. “భువనమ్మ ఆదరణతో మా జీవితం ధన్యమైంది” అని అన్నారు.గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేష్ ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ, తన కోరిక నెరవేరితే మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో శాశ్వత రథాన్ని సమర్పిస్తానని మొక్కుకున్నట్లు తెలిపారు. ఆ మేరకు కోటి రూపాయల వ్యయంతో రథాన్ని తయారు చేసి సమర్పించినట్లు చెప్పారు.ఆ కార్యక్రమానికి నారా భువనేశ్వరి హాజరు కాలేకపోయినప్పటికీ, తరువాత తనను గుర్తు పెట్టుకుని కుటుంబంతో కలిసి ఇంటికి ఆహ్వానించి ఆత్మీయంగా పలకరించడం తనకు మరపురాని అనుభూతిగా నిలిచిందన్నారు.అలాగే నారా రోహిత్ చేతుల మీదుగా రథ సమర్పణ జరిగినట్లు వివరించారు. భువనమ్మ చూపిన ప్రేమ, గౌరవం తమ కుటుంబానికి చిరస్మరణీయమని అట్లూరి భావోద్వేగంతో తెలిపారు.
