తెలంగాణ గురుకుల పాఠశాలల్లో నేటి నుంచి కొత్త డైట్ మెనూ అమలు
హైదరాబాద్, డిసెంబర్ 14:
తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నేటి నుంచి ప్రభుత్వం కొత్త డైట్ మెనూను అమలులోకి తీసుకువచ్చింది. గతంలో కల్తీ ఆహారంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విద్యార్థులకు పోషకాహారం అందించే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది.
మటన్, చికెన్ నెలకు రెండు సార్లు
విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వమిది నూతన అడుగు. నెలకు రెండు సార్లు లంచ్లో మటన్, నాలుగు సార్లు చికెన్ అందజేయనున్నారు. అదనంగా, వారానికి రెండు సార్లు ఉడికించిన గుడ్లు, ఫ్రైడ్ ఎగ్ ఇవ్వనున్నారు.
రోజు మెనూలో రుచికరమైన ఆహారం
వారానికి ఒక్కో రోజు ప్రత్యేక మెనూను అమలు చేయనున్నారు. ఇడ్లీ, వడ, పూరి, బోండా, పులిహోర, కిచిడీ, చపాతీ వంటి రుచికరమైన వంటకాలతో పాటు రాగిజావ, పాలు కూడా అందజేస్తారు. బ్రేక్ సమయాల్లో పండ్లు, పెసర్లు, బటానీలు, మిల్లెట్ బిస్కెట్లు అందించడం ద్వారా విద్యార్థుల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రభుత్వ లక్ష్యం: పోషకాహారం అందజేయడం
ఈ కొత్త మెనూను అమలులోకి తీసుకురావడం ద్వారా విద్యార్థుల ఆహారపు అవసరాలు తీరటమే కాకుండా, వారిలో పౌష్టికతను పెంచడం ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో ఈ కొత్త మెనూను అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
విధానంలో మార్పులు:
ప్రస్తుత వసతి గృహాల్లో సౌకర్యాలు మెరుగుపర్చడం కోసం ప్రభుత్వం ఖర్చులు 40 శాతం పెంచింది. కొత్త మెనూ ద్వారా విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంలో మరో అడుగు ముందుకేసింది.
విద్యార్థుల ఆరోగ్యం, అభివృద్ధిని ప్రోత్సహించే ఈ చర్యతో సంక్షేమ వసతి గృహాలు మరింత అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
