విజయవాడ, మార్చి 23, నేటి తెలుగు పత్రిక: విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం లో వసంతోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కనకదుర్గమ్మను మందార పుష్పాలు, ఎర్ర కలువలు, చామంతి పూలతో అద్భుతంగా అలంకరించారు. పుష్పాల సువాసనతో ఆలయ ప్రాంగణం పరిమళించగా, భక్తులు అమ్మవారి అలంకారాన్ని దర్శించి భక్తి పరవశంలో మునిగిపోయారు.
ఆలయ కార్యనిర్వహణాధికారి స్వయంగా పుష్పార్చన నిర్వహించగా, వైదిక కమిటీ సభ్యులు, స్థానాచార్యులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వసంతోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ భిన్న రకాల పుష్పాలతో అమ్మవారిని అలంకరిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నారు.వసంతోత్సవాల నేపథ్యంలో ఆలయానికి భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి దర్శనాలను సజావుగా నిర్వహిస్తున్నారు.


