మార్చి 23, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర రాజకీయాల్లో 6 గ్యారంటీ హామీల అంశం మళ్లీ వేడెక్కుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై విపక్షాలు దూకుడు పెంచుతున్నాయి. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఈ అంశాన్ని ప్రధాన అస్త్రంగా ఉపయోగించేందుకు సిద్ధమయ్యాయి.ఇప్పటికీ పలు గ్యారంటీలు పూర్తిగా అమలుకాలేదని ఆరోపిస్తున్న విపక్షాలు, బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై అధికార పార్టీని ఇరుకుపెట్టేలా కార్యాచరణ రూపొందించాయి. ఇందులో భాగంగా బీఆర్ఎస్ ఉభయసభల్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. టి. రామారావు సభ్యులందరూ ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, బీజేపీ కూడా ఇదే అంశంపై పోరాటానికి సిద్ధమవుతోంది. ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి పిలుపునిస్తూ, హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తోంది. పార్టీ నేతలను విడతల వారీగా అసెంబ్లీ ముట్టడికి తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీ వివిధ రూపాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో, కాంగ్రెస్ ఈ రాజకీయ దాడిని ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరంగా మారింది. రానున్న అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగా హాట్గా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
