మార్చి 23, నేటి తెలుగు పత్రిక: దేశంలో గ్యాస్ కొరత నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా చమురు సంస్థలు ముందడుగు వేస్తున్నాయి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న 14.2 కిలోల గృహ LPG సిలిండర్కు బదులుగా 10 కిలోల సిలిండర్ ప్రవేశపెట్టే ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది.కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కొరత లేదని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిలిండర్ బుకింగ్ చేసినా సమయానికి డెలివరీ కాకపోవడం, ఆలస్యం కావడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. వాణిజ్య సిలిండర్ల కొరతతో హోటళ్లు, రెస్టారెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కొన్ని చోట్ల ధరలు పెరగడంతో సామాన్యులపై అదనపు భారం పడుతోంది.
ఈ పరిస్థితుల్లో చమురు కంపెనీలు కొత్త మార్గాన్ని పరిశీలిస్తున్నాయి. అదే 14.2 కిలోల సిలిండర్లో గ్యాస్ పరిమాణాన్ని తగ్గించి 10 కిలోలుగా సరఫరా చేయడం. దీని వల్ల ఒకేసారి ఎక్కువ మందికి గ్యాస్ అందించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.ఇక సిలిండర్ బరువు తగ్గితే ధర కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి రెగ్యులేటరీ అనుమతులు అవసరం ఉంటుంది. అలాగే సిలిండర్ లేబులింగ్, రీఫిల్లింగ్ వ్యవస్థలో మార్పులు చేయాల్సి ఉంటుంది.ప్రస్తుతం ఈ ప్రతిపాదన పరిశీలన దశలో ఉన్నప్పటికీ, త్వరలోనే అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతల కారణంగా సరఫరా అంతరాయం ఏర్పడటం కూడా ఈ నిర్ణయానికి కారణంగా భావిస్తున్నారు.
