హైదరాబాద్, మార్చి 23, నేటి తెలుగు పత్రిక: విద్యుత్ శాఖలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సహాయం అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కో కుటుంబానికి రూ.1 కోటి చొప్పున ప్రమాద బీమా చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఓర్సు సురేష్, ముఖ్తార్ బేగ్ కుటుంబాలకు సీఎం చెక్కులు అందజేసి, వారికి అండగా నిలిచారు.విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కను సీఎం అభినందించారు.ఈ సందర్భంగా సీఎం కీలక ప్రకటనలు చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. అలాగే, అర్హత గల కుటుంబాలందరికీ రూ.5 లక్షల కుటుంబ బీమా వర్తింపజేస్తున్నట్లు వెల్లడించారు.కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ బీమా పథకాలను తీసుకొచ్చినట్లు సీఎం పేర్కొన్నారు.అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
