మార్చి 24, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సాదాబైనమా భూముల సమస్యలను త్వరలో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది.శాసనమండలిలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఈ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ నిర్ణయంతో సుమారు 9 నుంచి 10 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.గతంలో అమలులో ఉన్న నిబంధనల కారణంగా సాదాబైనమా భూముల పరిష్కారం ఆలస్యమైంది. ముఖ్యంగా కొనుగోలుదారుడు, అమ్మిన వ్యక్తి ఇద్దరి నుంచి అఫిడవిట్ అవసరం ఉండటం పెద్ద అడ్డంకిగా మారింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక మార్పు చేసింది.
ఇప్పటి నుంచి కేవలం కొనుగోలుదారుడి అఫిడవిట్ సరిపోతుంది. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన జీవో-76 అమల్లోకి రానుంది. దీంతో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం కానుంది.అదేవిధంగా భూసమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం భూధార్ నెంబర్ల వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు. ప్రతి భూమికి ఆధార్ తరహాలో ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వనున్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్గా కొన్ని గ్రామాల్లో అమలు చేసిన ఈ విధానాన్ని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు.మొదటి దశలో ప్రతి జిల్లాలో గ్రామాల వారీగా రీ-సర్వే నిర్వహించి, దశలవారీగా అన్ని భూములకు భూధార్ నెంబర్లు కేటాయిస్తారు. ఈ చర్యలతో భూవివాదాలు తగ్గి, రైతులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలగనుందని ప్రభుత్వం భావిస్తోంది.మొత్తంగా, ఈ నిర్ణయాలు తెలంగాణ రైతులకు దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపే దిశగా కీలకంగా మారనున్నాయి.
