మార్చి 24, నేటి తెలుగు పత్రిక: దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అవసరానికి సరిపడా ఇంధనం అందుబాటులో ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.అయితే గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ కోటి మందికి పైగా భారతీయ కార్మికులు పనిచేస్తున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో వారి భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు.ఇప్పటివరకు సుమారు 3.75 లక్షల మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించామని వెల్లడించారు. ఇంకా అక్కడ ఉన్నవారిని కూడా రక్షించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నామని మోదీ తెలిపారు. మొత్తంగా, ఇంధన సరఫరాపై ఎలాంటి సమస్యలేదని స్పష్టం చేస్తూనే, విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ప్రధాని పేర్కొన్నారు.
