మార్చి 24, నేటి తెలుగు పత్రిక: ఏపీలో సొంతిల్లు కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. గృహనిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారధి కీలక ప్రకటన చేస్తూ, వచ్చే నెలలోనే లబ్ధిదారుల తుది జాబితా విడుదల అవుతుందని తెలిపారు.ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY 2.0) కింద రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కలిసి పేదలకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారుకు రూ.2.39 లక్షల వరకు సాయం అందించనుంది.గతేడాది డిసెంబర్ వరకు దరఖాస్తులు స్వీకరించగా, సుమారు 10 లక్షల మంది అప్లై చేశారు. వీటిలో పరిశీలన తర్వాత 6.50 లక్షల మందిని అర్హులుగా గుర్తించి కేంద్రానికి పంపించారు. ప్రస్తుతం కేంద్రం కూడా ఫీల్డ్ లెవల్లో పరిశీలన చేపట్టగా, త్వరలో ఆమోదం వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్లో సమీక్ష నిర్వహించి, ఇళ్ల పథకం పురోగతిపై అధికారులతో చర్చించారు.
గ్యాస్ సరఫరాపై దృష్టి
రాష్ట్రంలో ఎల్పీజీ కొరతపై కూడా సీఎం స్పందించారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో గ్యాస్ సరఫరాలో సమస్యలు తలెత్తినట్లు పేర్కొన్నారు. ప్రత్యామ్నాయంగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG), ఇండక్షన్ స్టవ్స్ వినియోగాన్ని పెంచాలని సూచించారు. అదేవిధంగా శ్రీకాకుళం-కాకినాడ గ్యాస్ పైప్లైన్ పునరుద్ధరణపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రైతులకు సూచనలు
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను గుర్తించి, వారి జాబితాలను ఈ నెల 31లోపు సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.మొత్తంగా, ఇళ్ల పథకం నుంచి గ్యాస్, రైతు సమస్యల వరకు ప్రభుత్వం కీలక నిర్ణయాలతో ముందుకు సాగుతోంది.
