మార్చి 25, నేటి తెలుగు పత్రిక: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే అంశం భారతీయ మహిళల దశాబ్దాల కలగా భావిస్తున్నారు. ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ జాగృతి నిరంతరం పోరాటం చేస్తోంది.జంతర్ మంతర్ వేదికగా దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలను సమీకరించి నిరాహార దీక్ష చేపట్టిన తెలంగాణ జాగృతి, మహిళా రిజర్వేషన్ల ప్రాముఖ్యతను బలంగా వినిపించింది. అదే సమయంలో మహిళా కోటాలో ఓబీసీ మహిళలకు ప్రత్యేక సబ్ కోటా కల్పించాలని గట్టిగా డిమాండ్ చేసింది.ఈ అంశంపై ఆల్ పార్టీ సమావేశం నిర్వహించి, ఓబీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని తీర్మానం కూడా చేసినట్లు పేర్కొంది.
ప్రస్తుతం మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు దారితీసే పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో, మరోసారి ఈ డిమాండ్ను పునరుద్ఘాటించింది. ఓబీసీ మహిళలకు సబ్ కోటా లేకుంటే, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం దక్కదని ఆందోళన వ్యక్తం చేసింది.మహిళా రిజర్వేషన్లు అమలు చేసే సమయంలో సమాన అవకాశాలు కల్పించేలా ఓబీసీ సబ్ కోటా తప్పనిసరిగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి కోరింది.
