మార్చి 25, నేటి తెలుగు పత్రిక: ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా నిలిచే భారీ పరిశ్రమ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లాలో మెగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది.దాదాపు రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో నిర్మించనున్న ఈ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, ఉత్తరాంధ్రను “ఉక్కు ఆంధ్ర”గా మార్చే సామర్థ్యం కలిగినదిగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రం ఉక్కు రంగంలో దేశంలోనే అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది.ఇప్పటికే విశాఖ ఉక్కు పరిశ్రమ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన నేపథ్యంలో, ఈ కొత్త ప్లాంట్ ప్రాంత భవిష్యత్తుకు నూతన దిశానిర్దేశం చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
ఈ ప్రాజెక్ట్ సాధ్యంకావడంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ సహకారం కీలకమని పేర్కొన్నారు. ముడి ఖనిజాల సరఫరా నుంచి అనుమతుల వరకు ప్రతి దశలో కేంద్రం వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈ ప్రాజెక్ట్ సాధ్యమైందని తెలిపారు.“డబుల్ ఇంజన్ సర్కార్” విధానంతో ఈ ప్రాంతంలో ఒక స్టీల్ సిటీ నిర్మాణం జరుగుతోందని, దీని ద్వారా లక్షలాది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు.రాబోయే మూడేళ్లలో ఉత్తరాంధ్రలో అన్ని రంగాల్లో అభివృద్ధి వేగం పెరిగి, ప్రజలకు మెరుగైన జీవనావకాశాలు కలుగుతాయని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది.
